సైకిల్ పై వందల కిలోమీటర్ల యాత్ర.. మహిళా అభిమానికి చిరంజీవి అండ..

Spread the love

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చాటిచెప్పిన ఓ మహిళకు, మెగాస్టార్ చిరంజీవి తన ఉదార హృదయంతో అండగా నిలిచారు. తనను కలిసేందుకు వందల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి వచ్చిన అభిమాని రాజేశ్వరి కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. ఆమె పిల్లల చదువు బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సంఘటన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి, మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. తన అభిమాన నటుడిని కలవాలనే బలమైన ఆకాంక్షతో ఆమె కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. గతంలో పవన్ కల్యాణ్ కోసం ఆదోని నుంచి అమరావతికి సైకిల్‌పై వెళ్లిన రాజేశ్వరి, ఈసారి చిరంజీవి కోసం ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. ఆమె ప్రయాణంలో పలుచోట్ల మెగా అభిమానులు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం, తన పిల్లలతో కలిసి ఆమె చిరంజీవిని కలిశారు.

 

ఈ క్ర‌మంలో రాజేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవిని దేవుడిచ్చిన సోదరుడిగా భావిస్తూ ఆయనకు రాఖీ కట్టారు. ఆ క్షణంలో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా, చిరంజీవి ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు. ఆమె అభిమానానికి చలించిపోయిన ఆయన, సంప్రదాయబద్ధంగా ఒక చీరను బహూకరించి ఆశీర్వదించారు. అంతటితో ఆగకుండా, ఆమె పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. పిల్లలు బాగా చదువుకుని, ఉద్యోగాలు సాధించి తల్లిని బాగా చూసుకోవాలని సూచించారు. వారి చదువుకు అవసరమైన పూర్తి సహాయాన్ని తానే అందిస్తానని మాట ఇచ్చారు.

 

ఈ విషయం తెలియగానే, చిరంజీవి గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన కేవలం తెరపైనే కాదని, నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడుతున్నారు. అభిమానులను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారనడానికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *