సూపర్ సిక్స్-సూపర్ హిట్… ఈ నెల 10న అనంతపురంలో కూటమి పార్టీల భారీ సభ..

Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తొలిసారిగా ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. ఎన్నికల హామీ అయిన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలు విజయవంతం కావడంతో, ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.

 

ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని ఇంద్రప్రస్థనగర్‌లో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో దీనికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ పీవీఎన్ మాధవ్ హాజరుకానున్నారు.

 

గత 15 నెలల తమ పాలనలో సాధించిన విజయాలను, ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ‘సూపర్ సిక్స్’ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాయని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ వివరాలతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, సుపరిపాలన అందించడం వంటి అంశాలను ప్రజల ముందు ఉంచనున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యేలా కూటమి నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 2024 ఎన్నికల్లో 164 స్థానాలతో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, తమ ఐక్యతను, పాలన పటిమను చాటిచెప్పేందుకు ఈ సభను ఒక అవకాశంగా భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *