సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..? ఆ జాబితాలో చోటు వీరికే..!

Spread the love

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండటంతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుందంట. సంక్రాంతి సమయానికి తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోందంట. ఆ లిస్టులో ఖాయంగా పోటీ చేస్తారని అందరూ భావిస్తున్న పాతిక మంది పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది. సంక్రాంతి సమయానికి 20-25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండబోవని, ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్‌, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు వంటి వారి పేర్లు తొలిజాబితాలో ఉంటాయంటున్నారు.

 

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా ఫస్ట్ లిస్ట్ ఉండబోతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తమ అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో వారికి ఫోన్‌ సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. ఓవరాల్‌గా క్షేత్ర స్ధాయి సర్వే కూడా చేయిస్తున్నారంట.

 

పండుగకు ముందుగాని, తర్వాత గాని జాబితా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మిగిలిన అభ్యర్ధుల ప్రకటన ఉంటుందంటున్నారు. జనసేనతో పొత్తు నేపధ్యంలో రెండు పార్టీల అధినేతలు సీట్ల సర్దుబాటుపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. అది ఇప్పుడు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ తొలి జాబితా ప్రకటించేటప్పుడే సీట్ల పంపకాల వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

 

అది అలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రా.. కదలిరా.. పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో 22 అసెంబ్లీ స్ధానాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. టీడీపీ టికెట్లు ఎవరికి లభించబోతున్నాయో ఈ సభల ద్వారా సిగ్నల్స్ వస్తుండటం గమనార్హం. ఇప్పటి వరకు చంద్రబాబు ఆరు నియోజకవర్గాల సభల్లో పాల్గొన్నారు. వాటిలో కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్‌, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య ఇన్‌చార్జులుగా వ్యవహరించి సభా ఏర్పాట్లు చూసుకున్నారు. దాంతో వారే ఆయా సెగ్మెంట్ల క్యాండెట్లన్న క్లారిటీ ఇచ్చినట్లైంది.

 

వీరిలో తిరువూరుకి చెందిన దేవదత్‌ విషయంలో కొంత ఊగిసలాటలో ఉన్నా చివరకు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటగిరిలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా కురుగుండ్ల రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ టికెట్లు లభించబోతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు పాల్గొనే.. రా.. కదలిరా.. సభలు జరగనున్న నియోజకవర్గాల్లో గుడివాడకు వెనిగళ్ల రామ్మోహన్‌, గంగాధర నెల్లూరుకు డాక్టర్‌ థామస్‌, కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి, అరకుకు దన్ను దొర ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు

 

మండపేటకు వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరుకు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, ఉరవకొండకు పయ్యావుల కేశవ్‌, కోవూరుకు పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డి, పత్తికొండకు కేఈ శ్యాంబాబు, గోపాలపురం నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, మాడుగులకు పీవీజీ కుమార్‌, టెక్కలికి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు.

 

వీటిలో గోపాలపురంలో వెంకటరాజును ఆ నియోజకవర్గంలో ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోందట. చీరాలలో కొండయ్య యాదవ్‌ విషయంలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. మాడుగుల సీటు విషయంలో కుమార్‌కు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావు నుంచి పోటీ ఎదురవుతోందంట. ఈ మూడు సీట్లలో అధినేత నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్య

క్తమవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *