భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు

Spread the love

భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న వేళ.. ఆయన భారత దేశం తమ సైన్యాన్ని ఉపసరించుకోవాలని అన్నారు. మాల్దీవ్స్ రాజధాని మాలేలో భారత దౌత్యాధికారులతో.. మాల్దీవ్స్ అధికారులు ఈ అంశంపై చర్చించారు.

మార్చి 15లోపు భారత సైన్యం తిరిగి వెళ్లిపోవాలని మాల్దీవ్స్ అధికారులు కోరారు.

 

మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు తన అయిదు రోజుల చైనా పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. ఆయన రాగానే భారత సైనికులను తిరిగి పంపిచే ప్రక్రియ మొదలుపెట్టాలని తన అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. భారత్ నుంచి తీసుకున్న హెలికాప్టర్లను కూడా ఉపయోగించడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భారత్‌తో దౌత్య సంబంధాలపై కూడా మాల్దీవ్స్ అధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

మాల్దీవ్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా 77 మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. సైనిక సహాయంతో పాటు భారతదేశం మాల్దీవ్స్‌కు కానుకగా రెండు హెలికాప్టర్లు, ఒక విమానం కూడా ఇచ్చింది.

 

అయితే మాల్దీవ్స్‌లో భారత వ్యతిరేక నినాదంతో మహమద్ మొయిజు ఎన్నికలు గెలిచారు. ఆ తరువాత ఇటీవల ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశార. దీంతో భారత దేశంలో కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారంలో సెలెబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ కారణంగా భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *