దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీలో ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా విడుదల చేసిన సౌర విద్యుత్ విధానంలో భాగంగా.. ఈ పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం.
తమ రూఫ్ టాప్పై సోలార్ ప్యానెల్స్ను అమర్చుకున్న ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో ఎలాంటి శ్లాబ్ ఉండబోదని అన్నారు. నెలకు ఎన్ని యూనిట్లు వాడుకున్నా బిల్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదని అన్నారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతి నెలా 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకున్న గృహావసర విద్యుత్ వినియోగదారుల నుంచి బిల్లులను వసూలు చేయట్లేదు ఢిల్లీ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. అలాగే- ప్రతి నెలా 400 యూనిట్ల లోపు విద్యుత్ను వాడుకున్న వినియోగదారుల నుంచి సగం బిల్లును మాత్రమే వసూలు చేస్తోంది. నెలకు 400 యూనిట్లు దాటితేనే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
దీన్ని మరింత విస్తృతం చేశారు అరవింద్ కేజ్రీవాల్. రూఫ్ టాప్పై సోలార్ ప్యానెల్స్ అమర్చుకున్న వారికి జీరో బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎన్ని యూనిట్ల విద్యుత్ను వాడుకున్నా బిల్లు కట్టనక్కర్లేదని ప్రకటించారు.