రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వేడి క్రమంగా నెలకొంటోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందనే అంచనాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరీని మోగించింది. ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
శనివారం మలి విడత సభను ఏలూరు జిల్లా దెందులూరులోనిర్వహించబోతోంది వైఎస్ఆర్సీపీ. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనూ ముందంజలోనే ఉంది. ఇప్పటికే అయిదు విడతల్లో 75 అసెంబ్లీ, లోక్సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.
అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తోంది. రా.. కదలిరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలనను చేపట్టారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైనా దృష్టి పెట్టారు గానీ.. ఆ వ్యవహారం అంత త్వరగా తేలట్లేదు. మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రావట్లేదు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించీ ఆరా తీశారు.
సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సంబందించిన మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తుచేశారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని చెప్పారు.