రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

Spread the love

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సర్కార్‌. పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యేలా ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతోంది. పేదలకు అండగా నిలిచేందుకు భారత్ రైస్ తీసుకొస్తోంది. మంగళవారం భారత్ రైస్ విక్రయాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. భారత్ రైస్ రేటు కిలో 29 రూపాయలే. చౌకధరకే లభించే ఈ నాణ్యమైన సన్నబియ్యం సేల్స్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ వేదికగా ప్రారంభించారు.

 

ప్రారంభ దశలో 5 లక్షల టన్నుల బియ్యం

మొదటగా భారత్ రైస్‌ను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), కేంద్రీయ భండార్‌లో విక్రయించనున్నారు. ఆ తర్వాత అన్ని రిటైల్‌ చైన్ కేంద్రాల్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఇ- కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది కేంద్రం. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయించనున్నారు. రిటైల్ మార్కెట్ లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది.

 

‘భారత్ ఆటా’ తర్వాత ‘భారత్ రైస్’

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో ఇరవై ఏడున్నర రూపాయలు, భారత్ దాల్ శనగ పప్పును కిలోకు 60 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. భారత్ రైస్‌ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే 3 కేంద్ర కో-ఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *