తెలుగులో స్టార్ కథానాయికగా రాణిస్తోన్న సమంత ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ తో బాధపడుతున్న ఈ అమ్మడు దీనికోసం విదేశాల్లో చికిత్స తీసుకుంది. ప్రస్తుతం కథలను వింటోంది. త్వరలోనే ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను పలకరించాలనే నిర్ణయం తీసుకుంది. నాగచైతన్యతో వివాహానికి ముందు ఎంత పేరు తెచ్చుకుందో విడాకుల తర్వాత అంతకంటే ఎక్కువ పేరును సంపాదించింది. చిన్న చిన్న మనస్పర్థలవల్లే వీరిద్దరూ విడిపోయారని, కానీ వీరిద్దరికీ ఇప్పటికీ ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ అని అభిమానులు చెబుతుంటారు.
నాగచైతన్య పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమంత హావభావాలుకానీ, సమంత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నాగచైతన్య హావభావాలు కానీ మనం అర్థం చేసుకుంటే వీరిద్దరికీ ఇప్పటికీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉందని, భవిష్యత్తులో వీరిద్దరూ కలిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా తెలుగు ఫిలిం నగర్ లో ఓ వార్త వైరల్ గా మారింది. నాగచైతన్య ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. దీనికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
దీనికి సీక్వెల్ తీయాలనే యోచనలో విక్రమ్ ఉన్నారు. విక్రమ్ దర్శకత్వంలోనే గతంలో నాగచైతన్య, సమంత మనం అనే సినిమాను చేశారు. మరోసారి దూత సిరీస్ లో వీరిద్దరిని నటింపచేయాలనే యోచనలో దర్శకుడున్నారు. దీనికి సంబంధించిన కథను సమంతకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. అయితే నాగచైతన్యతో విభేదాల తర్వాత మానసికంగా గాయపడ్డానంటూ సోషల్ మీడియాలో తరుచుగా తన మనోభావాలను పంచుకునే సమంత ఇప్పుడు అతనితో కలిసి నటిస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో.. దర్శకుడి ప్రయత్నం ఫలిస్తుందేమోనని ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.