ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఇక తేలాల్సింది సీట్ల లెక్కలే. జనసేనకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. అటు బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో కలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యం ఇస్తానని జనసేనాన్ని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పొత్తులుంటాయన్నారు. ఆ దిశగానే ముందుకుసాగుతున్నామని చెప్పారు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి సమయంలో జనసేన నేతలు ఎమోషనల్ గా ఎలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించారు. జనసేన పాలసీలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని పార్టీ నాయకులకు నిర్దేశించారు. ఇలాంటి ప్రకటనలతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని పేర్కొన్నారు.
జనసేన నేతలు తమ అభిప్రాయాలను, సందేహాలను పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ కోరారు. అలా చేస్తే కార్యకర్తల మనోభావాలు పార్టీకి తెలుస్తాయని చెప్పారుట. అలాగే ఏపీ పొత్తుల విషయంలో భిన్న ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు.