గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..

Spread the love

గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. నిరుద్యోగుల పక్షాన నిలబడిన తెలంగాణ ప్రభుత్వం..గ్రూప్‌-1 పరీక్షపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను..రేవంత్‌ సర్కార్‌ ఉపసహరించుకోవడంతో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

 

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గతేడాది అక్టోబరు 21న దాఖలు చేసిన ఈ స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే.. రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్‌ 11 రెండోసారి పరీక్షను నిర్వహించింది. దాదాపు 2 లక్షల 33 వేల మంది పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు.. తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్‌ బెంచ్‌ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది టీఎస్‌పీఎస్సీ. ఇది అక్టోబరు నుంచి విచారణకు రాలేదు. తాజాగా ఈ అప్పీలు పిటిషన్‌ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది సీఎం రేవంత్‌ ప్రభుత్వం నేతృత్వంలోని టీఎస్‌పీఎస్సీ.

 

గ్రూప్‌-1 పరీక్షపై ఏదొక నిర్ణయం తీసుకోవాలని కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని భావించి పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వేస్తామని ప్రకటించింది. ఇటీవలే గ్రూప్-1లో మరో 60 ఉద్యోగాలను గుర్తించి.. ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. అయితే 2022లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌కు.. కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చాలా? లేక దానిని రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వడమా..అనేదానిపై చర్చిస్తోంది. పరీక్ష విధానం, సిలబస్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *