ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మంత్రి ఆర్కే రోజాను మరింత ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో రోజా కూడా ఎప్పటికప్పుడు షర్మిల విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలకు నిన్న నగరి టూర్ లో షర్మిల కౌంటర్ ఇస్తే.. దానికి తిరిగి రోజా ఇవాళ ఎన్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ బిడ్డనని చెప్పుకుని వైఎస్సార్టీపీని మూసేశారని తనపై రోజా చేస్తున్న విమర్శలకు నిన్న షర్మిల కౌంటర్ ఇస్తూ తాను పార్టీ మూసేయలేదని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఎప్పటికీ సజీవంగా ఉంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై తిరిగి ఇవాళ రోజా కౌంటర్ ఇచ్చారు. నగరిలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆస్తుల కోసమే షర్మిల రోడ్డెక్కారంటూ సంచలన విమర్శలు చేశారు.
షర్మిల నిన్న మొన్నటివరకూ తెలంగాణ బిడ్డనని చెప్పుకున్నారని, ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారంటూ రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో ఓట్లు చీల్చేందుకే షర్మిల ఎంట్రీ ఇచ్చారంటూ ఆరోపించారు. అసలు షర్మిల చంద్రబాబు వదిలిన బాణమంటూ రోజా మరో కొత్త విమర్శ కూడా చేశారు. జగన్ కూ, షర్మిలకూ ఉన్న తేడా ఇదే నంటూ రోజా మరో పోలిక కూడా పెట్టారు. జగన్ వైఎస్సార్ ఆశయాల కోసం వస్తే.. షర్మిల ఆశయాల కోసమే వచ్చారంటూ విమర్శించారు.
వైఎస్ కుమార్తెగా షర్మిల ఒక్క మంచి పని కూడా చేయలేదంటూ రోజా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల.. ఇప్పుడు అన్న జగన్ పైనే విషం చిమ్ముతోందన్నారు. దీంతో ఇప్పుడు రోజా వ్యాఖ్యలకు షర్మిల ఏం కౌంటర్ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.