రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.
జనసేన సైతం..:అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నారు.
పొత్తు వైపే..:బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఆమె పొత్తు వ్యాఖ్యలు చేశారు. పొత్తు ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
కొలిక్కి వచ్చినట్టే..:ఇప్పుడీ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన- బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.
21న ప్రకటన..:
బీజేపీతో పొత్తుపై ఈ నెల 21వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశం ఉంది. వీలైతే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, మహాకూటమిని ప్రకటిస్తారని చెబుతున్నారు.
సీట్ల షేరింగ్ ఇలా.. :
పొత్తులో భాగంగా బీజేపీ- జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను బీజేపీ-జనసేన పంచుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ కంటే కూడా బీజేపీ అధికంగా లోక్సభ స్థానాలను కోరుకుంటోంది.
లోక్సభపైనే బీజేపీ చూపు..:ఈ 10 లోక్సభ నియోజకవర్గాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. 10 వరకు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయిస్తే చాలని బీజేపీ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. మిగిలిన 20 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారు. వారికి టీడీపీ-బీజేపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
అభ్యర్థులు వీరే..:పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ కంటే లోక్సభకు వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తోన్నారని అంటున్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిల్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బీజేపీ అభ్యర్థిగా..:వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ దఫా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. నర్సాపురం లోక్సభ నుంచే ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతారని తెలుస్తోంది. అనంతపురం లేదా హిందూపురం లోక్సభ సీటుపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పోటీ చేస్తారని చెబుతున్నారు