దేవాలయాలను కూడా వదలని వైసీపీ.. ఇక డిపాజిట్లు గల్లంతే: చంద్రబాబు..

Spread the love

సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకం ఆడటం జగన్ కు పరిపాటిగా మారిందని చంద్రబాబు విమర్శించారు.

 

జగన్ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో నిర్వహించిన ఉమ్మడి ప్రచార సభలో చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని 160 దేవాలయాలపై దాడులు జరిగాయని వెల్లడించారు.

 

జగన్ ఓ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ విమర్శల వర్షం కురిపించారు. నెల్లమర్లలో కొండలన్నింటినీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనకొండలా మింగేసిందన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉత్తరాంధ్రకు తీసుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అంటూ ఎద్దేవా చేశారు.

 

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే భోగాపురం విమానాశ్రయం తీసుకువచ్చామని.. కానీ వైసీపీ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు. అదే టీడీపీ అధికారంలో ఉంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

టీడీపీ గెలిచిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందిస్తామన్నారు. అయితే అధికారంలో వచ్చిన వెంటనే తొలి సంతకం మాత్రం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తమ సభలకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. ప్రజల్ని ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా సరే.. వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు జోష్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *