ఏపీ ఎలక్షన్ హిస్టరీలో ఓ రికార్డు.. మనీ, బంగారం, డ్రగ్స్ అన్నీ కలిసి….

Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలంటే చాలు.. ధన ప్రవాహం ముందుగా గుర్తుకు వస్తుంది. ఎన్నికల్లో గెలవాలంటే భారీ ఎత్తున ఖర్చు చేయాల్సిందేనని నేతలు ఒక్కోసారి నిజాలు ఓపెన్‌గా చెబుతుంటారు. తాజాగా ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా కీలక విషయాలను వెల్లడించారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నుంచి ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 141 కోట్ల రూపాయాలు సీజ్ చేసినట్టు ప్రకటించారు. ఇందులో మనీ, బంగారం, డ్రగ్స్, చీరలు, గడియాలు, క్రికెట్ కిట్లు ఇతర వస్తువులున్నట్లు వెల్లడించారు.

 

2019 ఎన్నికల్లో పట్టుబడిన దానికంటే ఇది రెండు రెట్లు అధికమని చెప్పుకొచ్చారు ఏపీ ఎన్నికల అధికారి. అంతేకాదు ఎన్నికలకు ముందు ఈ స్థాయిలో స్వాధీనం చేసుకోవడం ఓ రికార్డుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంపై ఎన్నికల సంఘం ఓ కన్నేసిందన్నారు. ఈసీ చెబుతున్న ప్రకారం పరిశీలిస్తే.. ఎన్నికల పోలింగ్ నాటికి

మరింత నగదు, నగలు పట్టుబడడం ఖాయమన్నమాట.

 

ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని కుండబద్దలు కొట్టేశారు ఎన్నికల అధికారి మీనా. ముఖ్యంగా ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడమే తమ ధ్యేమన్నారు. ఎన్నికల ఆఫీసులో ఏర్పాటు చేసిన న్యూ టెక్నాలజీ సాయంతోనే ఇదంతా సాధ్యమైనట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి, ఉల్లంఘనలు, మద్యం, డబ్బు, బంగారం అక్రమ రవాణాపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

 

అలాగే 424 అంతర్ రాష్ట్ర సరిహద్దులు, 358 చెక్ పోస్టులలో అటు ఇటూ వచ్చే వాహనాల కదలికలపై వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓటర్లపై మద్యం ప్రభావం ఉండకూడదనేది ముఖ్య ఉద్దేశమన్నారు. మద్యం సరఫరా చేసే వాహనాలకు శాటిలైట్ ట్రాకింగ్ అమర్చినట్టు తెలిపారు. అక్రమ రవాణా నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం మరో రెండువారాలు మాత్రమే ఉంది. మే 11న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *