ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ వస్తేనే అభివృద్ధి: అమిత్ షా..

Spread the love

ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా మాట్లాడారు. ఏపీలో గుండాగిరిని రూపు మాపేందుకే టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. అవినీతి వైసీపీని గద్దె దించతామని తెలిపారు.

 

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత పలువురు కూటమి ముఖ్య నేతలు సభకు హాజరయ్యారు.అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే కూటమి ఏర్పడిందని అమిత్ షా అన్నారు. ఏపీలో భూ మాఫియాను అంతం చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఉన్నంత కాలం తెలుగు భాషను కాపాడుతాం అని తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జగన్ అవినీతిలో కూరుకు పోయి ప్రాజెక్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు వస్తేనే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని పేర్కొన్నారు.

 

ఇండియా కూటమిపై షా తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ వీరిలో ఎవరో చెప్పాలని అన్నారు. అసలు కూటమికి అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. మరో సారి మోదీనే దేశ ప్రధాని అని అమిత్ షా అన్నారు. దేశాన్ని రక్షించడంతో పాటు ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు మోదీ ప్రధాని కావాలన్నారు.

 

ఉమ్మడి ఏపీలో చంద్రబాబును ప్రజలు ప్రథమ స్థానంలో ఉంచారన్న ఆయన చంద్రబాబు హయాంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిదని అన్నారు. కానీ..జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఆరోపించారు. జగన్ మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. 25 ఎంపీ స్థానాల్లో కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *