జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. సూరన్ కోట్ ప్రాంతంలో వాహనాలపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలవ్వగా.. ఒకరు మృతి చెందారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భారత వాయుసేనకు సంబంధించిన వాహనంతో పాటు మరో వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించగా.. గాయపడిన మిగతా జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. గత ఏడాది నుంచి ఉగ్రవాదులు జవాన్లపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఏడాది సైన్యంపై జరిపిన అతి పెద్ద దాడి ఇదే. శశిధర్ సమీపంలో ఎయిర్ బేస్ లోపల వాహనాలను భద్రపరిచారు.