తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. జూబ్లీ హిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్లో హీరో ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఫిలింనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పుష్ప హీరో అల్లు అర్జున్ ఓటేశాడు.
మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవి, డైరక్టర్ తేజ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్ సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ జరగనుంది.
ఇక ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. హోం ఓటింగ్కు మొత్తం 23,247 మంది దివ్యాంగులతో పాటు, 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 21,651 మంది హోం ఓటింగ్ ప్రక్రియలో ఓటు వినియోగించుకున్నారు.
ఇక 2,29,072 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడంతో 1,75,994 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా పోలింగ్ రోజున 34973 మంది ఉద్యోగులు ఓటు వేయనున్నారు.