వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం ముగిసింది. అయితే, ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామిషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం ముగియడంతో మొత్తం 52 మంది బరిలో నిలిచారు.
అయితే, 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి 2027 వరకు ఉంది. అయితే, గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు.
ఈ పట్టభద్రుల నియోజకవర్గం మొత్తం 12 జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం పట్టభద్రుల ఓటర్లు 4,61,806 మంది ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నల్లగొండ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు.
మే 2 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, ఈ ఉప ఎన్నికకు మొత్తం 63 మంది దరఖాస్తు చేశారు.
అయితే, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 27న ఈ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. జూన్ 5న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం పలువురు ప్రముఖులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.