వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్..

Spread the love

దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్‌పేయిలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురు కనీసం మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి వారి సరసన నిలుస్తారా? లేదా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నామినేషన్ దాఖలు చేశారు. సరిగ్గా మంగళవారం ఉదయం 11.45 నిమిషాలకు తన నామినేషన్ పత్రాలను వారణాసిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఓ సాధువు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు.

 

అంతకుముందు ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు ప్రధాని. గంగానది వద్దనున్న దశ్వమేధ‌ఘాట్‌‌కు చేరుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కాలభైరవ దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమం ముగియడంతో భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి ఎన్డీయేకు చెందిన నేతలు హాజరయ్యారు.

 

1991 నుంచి 2019వరకు వారణాసి నియోజకవర్గం కమలనాధులకు కంచుకోట. కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్రమోదీ నాలుగున్నర లక్షల మెజార్టీ సాధించారు. గతంలో వచ్చిన మెజార్టీని పెంచుకునే పనిలో కమలనాధులు పడ్డారు. కానీ అది అంత ఈజీ కాదన్నది అక్కడి రాజకీయ నేతలు చెబుతున్నమాట.

ఈసారి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ బరిలోకి దిగారు. ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. ఈసారి వారణాసిలో గట్టి పోటీ ఖాయమన్నది ఓ అంచనా. ఇందుకు కారణాలు లేకపోలేదు. అజయ్‌రాయ్.. సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పటికే రెండుసార్లు వారణాసి నుంచి బరిలోకి దిగిన ఆయన.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఏడాది కిందట నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటు కాంగ్రెస్‌కు వెళ్లింది.

 

1996లో అజయ్‌రాయ్ పొలిటికల్ ట్రావెలింగ్ మొదలైంది. బీజేపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగన ఆయన.. కమ్యూనిస్టులపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదొక సంచలనం. దీంతో ఆయన పాపులర్ అయ్యారు. అంతేకాదు బీజేపీ-బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఢిల్లీ రాజకీయాలపై అజయ్ దృష్టి పెట్టారు. కానీ కమలనాధులు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన, సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చివరకు మోదీపై అజయ్‌రాయ్ పోటీ దిగడం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *