ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని ఆజంఘర్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. దేశంలో అలజడి రేపేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టం కింద శరణార్థులకు భారత సౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ విభజన జరిగిన కారణంగా వారంతా దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి భారత పౌరసత్వం అందజేశామని వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన నేతలు ఆపై ఆయన చెప్పిన మాటలను మరచిపోయారని అన్నారు. ఇతర దేశాలలో నివసించే మైనర్టీలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు భారత్ కు రావచ్చని గాంధీ చెప్పిన అంశాన్ని మోదీ గుర్తు చేశారు.
తమ సంస్కృతి, మతాన్ని పరిరక్షించుకునేందుకు గత 70 ఏళ్లుగా వేలాది కుటుంబాలు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. వీరు కాంగ్రస్ కు ఓటు బ్యాంకు కాకపోవడం వల్లే వీరిని ఆ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఏఏపై ఎస్పీ, కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చుస్తున్నారని మండిపడ్డారు.
ఆజంఘర్ బహిరంగ సభ అనంతరం మోదీ యూపీలోని భాదోహి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.