ఏపీలో ఎన్నికలు జరిగిన తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపినట్లు సమాచారం. నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, మాచర్, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటనలపై రాష్ట్ర ఈసీ ఆఫీస్, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది.
కాగా, సిట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. అయితే, ఇప్పటికే ప్రాథమిక విచారణను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల అనంతరం పల్నాడు, చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, నరసరావుపేటలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిట్ ను ఏర్పాటు చేసి ఈ సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సిట్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నది. ఆ సంఘటనలకు చోటు చేసుకోవడానికి గల కారణాలు..? అవి చెలరేగడానికి గల కారణాలు..? ఎవరు కారకులు..? వాటిని ఎవరు ప్రోత్సహించారు..? ఇలా మొత్తంగా పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేయనున్నది. అదేవిధంగా ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లను కూడా పరిశీలించనున్నది. ఇలా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు సంబంధించిన నివేదిక ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నది.
అయితే, ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో పోలీసులు భారీగా మోహించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచి పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలతోపాటు అదనపు బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఇటు స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా, పలువురు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. సంఘటనల్లో వారి వైఫల్యం కనిపించడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఈసీ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకుముందు, ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న సంఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించగా, వారు గురువారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చిన విషయం విధితమే.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను గత సోమవారం నిర్వహించారు. ఎన్నికల అనంతరం ఏపీలో పలు చోట్లా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేడు విశాఖలో కూడా ఓ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది.