జనతాదళ్ సెక్యులర్ (JDS) అధినేత, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ గురువారం తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
మాజీ ప్రధాని X (గతంలో ట్విట్టర్)లో, ప్రజ్వల్కు తాను రాసిన లేఖను పోస్ట్ చేసి, దానికి క్యాప్షన్ పెట్టారు, ” @iPrajwal రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి.. చట్టపరమైన ప్రక్రియకు లోబడి ఉండాలి. ఇంకా నా ఓపికను పరీక్షించవద్దు,” అని హెచ్చరించారు.
ప్రజ్వల్ రేవణ్ణకు నా హెచ్చరిక అనే శీర్షికతో మే 23న రాసిన లేఖను జోడించారు దేవెగౌడ. తాను మే 18న ఆలయానిక వెళ్లినప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ గురించి మాట్లాడానని.. అతను తనకు, తన కుటుంబానికి, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు కలిగించిన బాధ, షాక్ నుంచి తేరుకోడానికి కొంత సమయం పట్టిందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రజలు తనని, తన కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడారని, తీవ్రమైన పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడనని.. ఎవరెవరు ఏమేమి మాటలు అన్నారో తెలుసని.. వాటిని తాను ఆపాలనుకోవట్లేదని, అలాగే వాటిపై విమర్శలు కూడా చేయనని మాజీ ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
ప్రజ్వల్ చేసిన తప్పులను తాను సమర్ధించబోనని అన్నారు దేవెగౌడ. ఇప్పుడు తన ముందున్న అంశం ప్రజ్వల్ చట్టపరమైన ప్రక్రియకు లోబడి ఉండటమేనని లేఖలో ప్రస్తావించారు. ఇందుకోసం ప్రజ్వల్కు హెచ్చరిక జారీ చేస్తున్నానని.. ఎక్కుడన్నా తాను ఇక్కడకు వచ్చి లొంగిపోవాలని లేఖలో ప్రస్తావించారాయన.
చివరగా ప్రజ్వల్ తప్పు చేసినట్లు తేలితే కఠినమైన శిక్షలను విధించాలంటూ పేర్కొన్నారు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ. ప్రజలు తనకు 60 ఏళ్లుగా మద్ధతు తెలిపారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని తేల్చిచెప్పారాయన.
కాగా యువతులను ట్రాప్ చేసి, బెదిరించి లైంగింక వాంఛలను తీర్చుకున్నాడని ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. కర్ణాటకలో పోలింగ్ ముగిసన అనంతరం ప్రజ్వల్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో త్వరలో సత్యం గెలుస్తుందని స్పందించారు. కానీ ఇప్పటివరకు తన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో తాజాగా ప్రజ్వల్ తాత, మాజీ ప్రధాని దేవెగౌడ ఎక్కడున్న ఇండియాకు వచ్చి లొంగిపో అని హెచ్చరించారు.