ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ.

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా.. రాజకీయ పార్టీలు, నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దంటూ ఆయన స్పష్టం చేశారు. మచిలీ పట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రంకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

 

కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సీఆర్పీఎఫ్ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తాయని మీనా తెలిపారు. ఎన్నికల తరువాత కూడా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలంటూ ఆయన పేర్కొన్నారు.

 

కాగా, ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. 25 లోక్ సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈసారి పోలింగ్ శాతం గతంలో కంటే భారీగా నమోదైంది. ఫలితాలు జూన్ 4న రానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా ఇదే రోజున విడుదల కానున్నాయి. అయితే, ఏపీలో పోలింగ్ రోజు, ఆ తరువాత కూడా పలు చోట్లా పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. ముందస్తు చర్యలో భాగంగా కౌంటింగ్ రోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *