టోల్ ప్లాజా రేట్లు భారీగా పెంపు..!

Spread the love

దేశంలో ఎన్నికల సందడికి తెర పడింది. శనివారం నాటితో చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత ఎన్నికల మొదలు కాగా.. ఏడు దశల్లో ఓటింగ్ కొనసాగింది. 90 కోట్ల మందికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

 

ఎన్నికలు ముగిసీ ముగియగానే కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా రేట్లను అమాంతం పెంచేసింది. పెంచిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి.

 

జూన్ 1వ తేదీ నాడే ఈ రేట్లను సవరించాలని జాతీయ రహదారుల అథారిటీ నిర్ణయించినప్పటికీ- చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. టోల్ ప్లాజా రేట్ల పెంపు వల్ల ఏర్పడే దుష్ప్రభావం ఓటర్లపై పడకుండా జాగ్రత్తలను తీసుకుంది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో- ఈ అర్ధరాత్రి నుంచి వాటి రేట్లు పెంచేలా ఉత్తర్వులను జారీ చేసింది.

 

ఈ పెంపు కనిష్ఠంగా 45 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఉండబోతోంది. మొత్తంగా ఇప్పుడు అమలులో ఉన్న రేట్లను అయిదు శాతం వరకు పెంచింది ఎన్‌హెచ్ఏఐ. జాతీయ రహదారులు మాత్రమే కాకుండా ఎక్స్‌ప్రెస్ వే, ఫెరిఫెరల్ రోడ్ల మీద నిర్మించిన అన్ని టోల్ ప్లాజాలనూ దీని పరిధిలోకి తీసుకొచ్చారు.

 

ఈ పెంపుదల పట్ల సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రోడ్ల నాణ్యతకు మించిన స్థాయిలో టోల్ ప్లాజా ఛార్జీలను వసూలు చేస్తోన్నారని, ఇప్పుడు మళ్లీ అయిదు శాతం మేర పెంచడం సబబు కాదంటూ వాహనదారులు వాపోతున్నారు. ప్రతీసారీ పెంచుకుంటూ పోవడం వల్ల అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *