ఏపీలో వైసీపీ దారుణ పరాజయం పొందడంతో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. సజ్జలతో సహా 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా చేయగా.. వారు తమ రాజీనామా పత్రాలను సీఎస్ జవహార్ రెడ్డికి పంపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా 20 మందికి పైగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్కు లేఖలు పంపించారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు తప పదవీ కాలాన్ని పొడగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి.. ఎన్నికల ఫలితాల తర్వాత మనస్సు మార్చుకున్నారు. తనను పదవి నుంచి రిలీవ్ చేయాలంటూ తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.
జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి, తది తరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను పంపించారు. కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్ పదవి నుంచి రిలీవ్ చేయాలని జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్ కోరారు. సురేంద్రనాథ్ తనను మాతృసంస్థకు పంపాలని వీసీని కోరారు.
గతంలో ఈయన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో బయో టెక్నాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. డిప్యుటేషన్పై ఆర్కిటెక్చర్ వర్సిటీలో చోటు సంపాదించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సురేంద్రనాథ్ ఆ పోస్టులోకి వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి.