పట్టిసీమ నుంచి నీటి విడుదల..!

Spread the love

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు విడుదల చేశారు. 4,5,6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ నుంచి నీటి విడుదలతో.. కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం అవడంతో పాటుగా పంటకు సాగునీరు కూడా అందుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు. పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా చెప్పారని, ఇప్పుడు అదే పట్టిసీమ బంగారుసీమ అయిందని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరంతోనే ఇతర నదుల అనుసంధానం సాధ్యమవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. వృథాగా పోతున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకోవచ్చని తెలిపారు. పట్టిసీమ ద్వారా ప్రతీఏటా 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చన్నారు. కృష్ణాడెల్టాకు సాగు, త్రాగునీరు అందించడానికి కారణం పట్టిసీమేనన్నారు.

 

గత ప్రభుత్వం రాష్ట్రంలో త్రాగునీటి వ్యవస్థను విధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. పట్టిసీమే లేకపోతే లక్షలాదిమంది ప్రజల దాహార్తి తీర్చగలిగేవాళ్లం కాదన్నారు. ఇక ఏలేరు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. రిజర్వాయర్లో నీళ్లుంటే.. స్టీల్ ప్లాంట్ కు, విశాఖకు ప్రతినిత్యం త్రాగునీరు సరఫరా చేయగలుగుతామని చెప్పారు. 1.50 లక్షల ఎకరాలకు తాడిపూడి నుంచి సాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *