తెలంగాణలో రూ.5 వేల కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు..

Spread the love

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నవీకరణకు కీలక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు నెలకొల్పాలని నిశ్చయించింది. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ కు 20 నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించనున్నారు.

 

ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ల నమూనా విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రూ.5 వేల కోట్లతో ఈ స్కూల్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

 

అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది నుంచే అన్ని నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు.

 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు రాష్ట్ర ప్రజలకు దసరా కానుక అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థులను పట్టించుకోలేదని విమర్శించారు. చదువుకుంటే బాగుపడతారనేది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *