అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

Spread the love

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు. వీటి ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమిపూజ చేస్తారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మధిర నియోజకవర్గంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో విశాలమైన క్యాంపస్‌లో ఈ స్కూళ్లను నిర్మించాలని సంకల్పించింది ప్రభుత్వం. మొదటి విడతలో 28 చోట్ల ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, సామాజిక అంతరాలు లేని విద్యను అందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ క్యాంపస్‌లలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయబోయే ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోటకు చేర్చి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. దీనివల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి దశలో 28 నియోజకవర్గాల్లో స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *