తెలంగాణలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్దం తారా స్థాయికి చేరింది. ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం అదే రకంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ లక్ష్యంగా హరీష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో 11 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్టబయలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏ వర్గానికి తామిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్
వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా ధర్నాలతో అట్టుడికి పోతోందని చెప్పుకొచ్చారు. ధర్నాలు చేసే వారిని చర్చలకు పిలిచి వారితో మాట్లాడాల్సిన ప్రభుత్వం..వారిని ఎందుకు చర్చలకు పిలవటం లేదని హరీష్ ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కొత్త హామీలు అమలు చేయలేని రేవంత్.. కేసీఆర్ మానవీయ కోణంలో పేదలు, ప్రజల కోసం తెచ్చిన పథకాను కొనసాగించలేకపోతున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామని చెప్పి.. ఒకట కూడా ఇవ్వలేదన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతుబంధు ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారి..ఇప్పుడు, ఒక్క పంటకు కూడా రైతు బంధు లేదని విమర్శించారు. పదిహేను వేలు కాదు, ఉన్న పది వేలు కూడా రావడం లేదని ధ్వజమెత్తారు. రైతులు రోడ్డెక్కితే నీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఎద్దేవా చేసారు.