దేశాన్ని వృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి కూడా పలు చర్యలు తీసుకుంటోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు ప్రవేశపెడుతూ, ప్రస్తుతం ఉన్నావాటికి సవరణలు చేస్తూ పోతోంది. తాజాగా కేంద్రం NPS రూల్స్కు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అనేక నియమాలను సవరించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సర్వీస్-సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 2021ని నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ను పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి అనుమతించబడతారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు ఒక ఉద్యోగి వారి నియామక అధికారానికి కనీసం 3 నెలలకు ముందు వ్రాతపూర్వక నోటీసును సమర్పించాల్సి ఉంటుంది. ఈ పదవీ విరమణ నోటీసును అపాయింటింగ్ అథారిటీ అంగీకరించాలి. అనుమతిని ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉండదు.
స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవసరమైతే ఈ 3 నెలల నోటీసు వ్యవధిని తగ్గించాలని వారి నియామక అధికారిని అభ్యర్థించవచ్చు. దీనికి సరియైన కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత వ్యవధిని తగ్గించడం వల్ల ఎటువంటి పరిపాలనాపరమైన అసౌకర్యం కలగదని అధికారి సంతృప్తి చెందితే, నోటీసు సమయాన్ని సడలించవచ్చు.
స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తరువాత PFRDA నిబంధనల ప్రకారం PF ఉపసంహరణకు సబ్స్క్రైబర్ అనుమతించబడతారు. అప్పటి నుంచి ఇతర పదవీ విరమణ ప్రయోజనాలకు సైతం అర్హత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి తన పెన్షన్ ఖాతాను కొనసాగించాలని లేదా పదవీ విరమణ తేదీ తర్వాత కూడా NPS కింద ప్రయోజనాల చెల్లింపును వాయిదా వేయాలని భావిస్తే, ఆ విషయాన్ని PFRDAకు తెలియజేయాలి.