బీసీ జనాభా లెక్కింపునకు ప్రత్యేక కమిషన్..!

Spread the love

తెలంగాణా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కులగణనకు టాప్ ప్రయారిటీ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ సత్వరం నిర్ణయాలు తీసుకుంటున్నారు. కులగణనపై ఇటీవల హైకోర్టు సూచనల నేపథ్యంలో సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్.. తెలంగాణాలోని బీసీల లెక్కింపునకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల హైకోర్టు సూచనలను వేగంగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కోర్టు..రెండు వారాల గడువు ఇవ్వగా, సీఎం మాత్రం వెంటనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక కమిషన్‌ తప్పనిసరి అని పేర్కొంది. తొలుత రాష్ట్రంలోని బీసీల జనాభాను లెక్కించే బాధ్యతల్ని బీసీ కమిషన్ కు అప్పగించారు. అయితే..ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. దాంతో.. విచారణ చేపట్టిన హైకోర్టు.. బీసీ కమిషన్‌ను డెడికేటెడ్‌ కమిషన్‌గా గుర్తిస్తూ విడుదల చేసిన జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

 

దాంతో తదుపరి చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలకు వెళ్లదన్న సీఎం..రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *