కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు..

Spread the love

కేంద్రంలోని కీలక పదవిలో ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది. కాగ్ అధిపతిగా ఏపీకి చెందిన సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ముర్ము కాగ్ చీఫ్‌గా ఆయనను నియమించినట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

 

కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరిగా ఖర్చు చేసిందా పక్కదారి పట్టిందా చూసే బాధ్యత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రభుత్వం ఖర్చుల గురించి ఏడాదికి ఒకసారి నివేదిక ఇస్తుంది. దాన్ని పార్లమెంటులో ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. దాని ఆధారంగా అధికార-విపక్షాల మాటల యుద్ధం జరుగుతుంది.

 

సింపుల్ చెప్పాలంటే ఇది చాలా కీలకమైన పదవి కూడా. ఇలాంటి వాటికి అధిపతి కావాలని చాలామంది ఐఏఎస్‌లు ఉవ్విళ్లూరుతారు. కొందరి మాత్రమే అలాంటి అదృష్టం వరిస్తుంది. అలాంటి వారిలో తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి ఒకరు.

 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందినవారు కె. సంజయ్ మూర్తి. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి. 1964లో జన్మించిన సంజయ్ మూర్తి, మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు.

 

ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. మూడేళ్లు కిందట అంటే 2021లో జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పని చేశారు సంజయ్. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో తనవంతు పాత్ర పోషించారాయన. వచ్చే నెలలో ఆయన పదవీ విరమణ చేయాల్సిఉంది. ఈలోగా అదృష్టం ఆయనను వరించింది.

 

సంజయ్‌మూర్తి సేవలను గమనించిన కేంద్రం, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. కాగ్ అధిపతి పదవి చేపడుతున్న తొలి తెలుగు వ్యక్తి ఆయనే. ఇందులో నియమితులైనవారు ఆరేళ్ల వరకు అందులో కొనసాగే వీలుంది. అన్నట్లు సంజయ్‌మూర్తి తండ్రి కూడా ఐఏఎస్ అధికారే.

 

కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కార్యదర్శిగా కెఎస్ఆర్ మూర్తి సేవలు అందించిన విషయం తెల్సిందే. ఐఏఎస్ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జీఎంసీ బాలయోగిని ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *