మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. ఇక ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఓటు వేసిన అనంతరం ఓటర్లంతా తమ బాధ్యతగా ఓటు వేయాలని నటులు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32.18 శాతం, జార్ఖండ్లో మాత్రం భారీగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 47.92 శాతం ఓటింగ్ నమోదైంది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం నుంచి పోలింగ్ నడుస్తోంది. ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక జార్ఖండ్లో అయితే రెండు విడతలగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత నవంబర్ 13న జరగగా.. రెండో విడత బుధవారం జరుగుతోంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి. ప్రజల నాడీ ఎలా ఉందో దాదాపుగా ఒక పిక్చర్ వచ్చేస్తోంది.