అత్యవసర సేవలైన 108 సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ కొద్ది రోజులు సిబ్బంది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో ఒక రోజు నిరాహార దీక్ష చేసిన ఉద్యోగులు ఇక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. 15 డిమాండ్లతో ఉద్యోగులు సమ్మ బాట పట్టారు. జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సమ్మె ప్రారంభం కానుంది. తమ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదని 108 అంబులెన్సు ల సిబ్బంది వాపోతున్నారు. సమ్మె నోటీసు గడువు ఈ రోజుతో ముగియనున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదు. దీంతో, ఈ అర్ద్రరాత్రి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. 108 సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్లోఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని 15 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు కొద్ది రోజుల క్రితం ఇచ్చామని చెప్పారు.
తమ ఆందోళన గురించి వివరిస్తూ సమ్మె నోటీసు ఇచ్చి 14 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 ఉద్యోగుల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. 108 లో పని చేసే సిబ్బందికి ఎనిమిది గంటల పని, మూడు షిఫ్టులుగా చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల ను పరిష్కరించకపోతే నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్తే జరిగే ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దీంతో, అత్యవసర సేవలుగా ఉన్న 108 సేవలకు అంతరాయం కలగకుండా.. సిబ్బందిని సమ్మెలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.