పవన్ సీజ్ చేసిన షిప్ లో బియ్యం లెక్క తేలింది-కలెక్టర్ కీలక ప్రకటన..!

Spread the love

గత నెలలో కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే బయలుదేరి కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ సముద్రంలో నిలిపి ఉంచిన స్టెల్లా ఎల్ 1 విదేశీ నౌకలోకి వెళ్లారు. అధికారులు అడ్డుపడుతున్నా అక్కడికి వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించారు. షిప్ సీజ్ కు ఆదేశాలు ఇచ్చారు. అయితే షిప్పులో దొరికిన బియ్యం.. గతంలో పట్టుకున్న బియ్యమా, అక్రమమా కాదా అన్న అంశాల్ని తేల్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

 

కాకినాడ పోర్టులో గత నెలలో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ 1 నౌకలో మొత్తం 4 వేల టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్

షన్మోహన్ ప్రకటించారు. అయితే ఇందులో 1320 టన్నులు మాత్రం రేషన్ బియ్యం ఉన్నాయన్నారు. నవంబర్ 29న తమకు దొరికిన ఈ బియ్యాన్ని అధికారులు ల్యాబ్ కు పంపి పరిశీలన చేశారని ఆయన తెలిపారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని స్థానిక సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.

 

అయితే ఇప్పటికే ఓడను సీజ్ చేసిన అధికారులు.. ఇందులో ఉన్న 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని బయటికి తెచ్చి సీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తెచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తోందో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం కాకినాడ పోర్టులో ఎగుమతి కోసం 12 వేల టన్నుల బియ్యం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేస్తామని వెల్లడించారు. కొత్తగా మరిన్ని చెక్ పోస్టులు పెట్టి దేశం నుంచి ఒక్క గ్రాము రేషన్ బియ్యం కూడా ఎగుమతి కాకుండా చూస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *