ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుండి యావత్ ప్రజలు ఈ పథకం కోసమే ఎదురుచూపుల్లో ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలుపై మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు, కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తారని అందరూ భావించారు. కానీ ఫ్రీ బస్సు స్కీం అమలు చేయాల్సిన తీరుపై ప్రభుత్వం చర్చలు సాగించింది. ఇతర రాష్ట్రాలలో పథకం అమలవుతున్న తీరును కూడా రవాణా అధికారులు సమీక్షించారు. మొదట దీపావళికి ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతుందని అందరూ భావించినా, దీపం 2.oను ప్రభుత్వం అమలు చేసింది.
తాజాగా ఫ్రీ బస్ స్కీమ్ తెరపైకి వచ్చింది. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడే వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడంటూ విమర్శల జోరు సాగించారు. దీనితో సీఎం చంద్రబాబు కూడా సాధ్యమైనంత త్వరగా మహిళలకు ఫ్రీ బస్ అమలు చేయాలని భావిస్తున్నారట. అందుకే సోమవారం రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో చర్చించారు. ఈ చర్చలో అసలు ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటినుండి అమలు చేయాలన్న చర్చ సాగిందట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఉగాదికి ఫ్రీ బస్ అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు సూపర్ సిక్స్ హామీల అమలుపై విమర్శలు వినిపిస్తుండగా, వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. కాగా ఇటీవల పింఛన్ల పెంపు, రహదారుల అభివృద్ది, నీటి ప్రాజెక్ట్ లు, అర్చకులు, ఇమామ్, పాస్టర్స్, నైవేద్య సాయం అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, తాజాగా ఫ్రీ బస్ స్కీమ్ అమలుపై దృష్టి సారించింది. ఈ స్కీమ్ అమలైతే కూటమి ఇచ్చిన హామీలలో మరో ప్రాధాన్యత హామీ నెరవేరినట్లేనని చెప్పవచ్చు.