హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అత్యవసరమైన సమయాల్లో వేగంగా వెళ్లడం కూడా వీలుండదు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తిని ప్రాణాలు కాపాడేందుకు మెట్రో రైలును ఆశ్రయించారు. ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి గెండును తరలించాల్సి ఉండటంతో హైదరాబాద్ మెట్రో అధికారులను సంప్రదించారు.
దీంతో మెట్రో రైలు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ మెట్రో రైలు గ్రీన్ కారిడార్ ద్వారా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్ గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి దాత గుండెను సురక్షితంగా వేగంగా తరలించారు. హైదరాబాద్ మెట్రో రైలు, వైద్య నిపుణులు, ఆస్పత్రి అధికారుల సమన్వయంతో ఈ పని విజయవంతమైంది.
ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం కోసం మెట్రో సిబ్బంది, వైద్య బృందం కిలిసి ప్రతిచోటా పూర్తి సమర్థతతో పనిచేశారు. అనుకున్న సమయంలో గుండె గమ్యస్థానం చేరడంతో.. గుండె మార్పిడికి సంబంధిత ప్రక్రియలన్నింటినీ వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రో రైలు రోజుకు లక్షల మంది నగర వాసులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తరలించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ మెట్రో రైలు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ ప్రాణాన్ని కాపాడటంతో అందరి మన్ననలను పొందుతోంది.