ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్క.. నాలో కూడ మార్పు వచ్చింది. నేనేంటో చూపిస్తా.. జగన్ 2.o ను చూడబోతున్నారంటూ మాజీ సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యాలయంలో విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం జగన్ తొలిసారిగా కార్పొరేటర్లతో సమావేశమై.. కూటమికి హెచ్చరికలు జారీ చేశారని చెప్పవచ్చు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో, రోబో 2.o సినిమాలు సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రోబో సినిమా కంటే రోబో 2.o ఇంకా హైలెట్ అంటారు సూపర్ స్టార్ అభిమానులు. సేమ్ టు సేమ్ ఇదే తరహా డైలాగ్ తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు వైఎస్ జగన్. ఇక నుండి జగన్ 2.o చూడడం ఖాయమంటూ.. జగన్ తేల్చి చెప్పారు. జగన్ చెప్పిన ఈ డైలాగ్ ను వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది.
అయితే ఈ సమావేశంలో జగన్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని, కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానంటూ జగన్ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని జగన్ ఈ సందర్భంగా కామెంట్ చేయడం విశేషం. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రైవేట్ కేసులు వేసి వారిని చట్టం ముందు నిలబెడతానంటూ జగన్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, తామే అధికారంలోకి వస్తామని జగన్ జోస్యం చెప్పారు. 30 ఏళ్లు అధికారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సహజమన్నారు. అన్నింటిని తట్టుకొని నిలబడే శక్తిని కార్యకర్తలకు తాను అందిస్తానని, రాజకీయంగా మనం ఎదుగుతున్నామనే కేసులు పెడుతున్నారంటూ జగన్ అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్న విషయాన్ని కార్యకర్తలు గమనించాలని, జైలు నుంచి వచ్చిన అనంతరం తాను సీఎం అయ్యానంటూ జగన్ చెప్పడం విశేషం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా సంక్షేమ పథకాలను అమలు చేశామని, సూపర్ సిక్స్ అంటూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. జనంలోకి కూటమి నేతలు వెళితే అసలు విషయం వారికి తెలుస్తుందని జగన్ అన్నారు. ఇలా విదేశీ పర్యటన ముగించుకున్న జగన్.. తొలిసారిగా విజయవాడ కార్పొరేటర్లతో, ముఖ్య నాయకులతో సమావేశమై చేసిన ప్రసంగం ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.