టీటీడీ ఉద్యోగిపై రెచ్చిపోయిన బోర్డు సభ్యులు..! గుడి ఆవరణలో బూతు పురాణం..?

Spread the love

తిరుమల గిరులు నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతాయి. అక్కడికి వచ్చే భక్తులు చెడు మాటలు, చెడు పనులకు దూరంగా ఉంటారు. శ్రీవారి దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తగ్గుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే అక్కడ గడిపిన కొద్ది సమయం శ్రీవారి లీలలు, అద్భుతాలు గురించే ఎక్కువ మంది మాట్లాడుతారు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు గుడి ఆవరణలో బూతు పురాణం మొదలుపెట్టారు. ఇంతకీ అసలేం జరిగింది?

 

అసలేం జరిగింది?

 

నార్మల్‌గా అయితే బోర్డు సభ్యులకు దగ్గరుండి దర్శనం చేయిస్తారు అధికారులు. దర్శనం తర్వాత మహాద్వారం ఎవరినీ బయటకు పంపరు. భక్తుల దారిలోనే అందరూ రావాల్సి ఉంటుంది. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్. ఫ్యామిలీ సభ్యులతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారాయన.

 

బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని టీటీడీ ఉద్యోగిని కోరాడు. అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని రిప్లై ఇచ్చాడు. దీంతో సహనం కోల్పోయారు బోర్డు సభ్యుడు నరేష్ కుమార్. తనను మహాద్వారం గేటు ద్వారా పంపలేదని ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు బోర్డు సభ్యుడు.

 

ఇటు నుంచి ఎవరినీ బయటకు పంపలేదని చెప్పుకొచ్చాడు. దీంతో బోర్డు సభ్యుడు నరేష్‌కు కోపం కట్టలు తెచ్చుకుంది. నన్నే ఆపుతావా? అంటూ ఉద్యోగిపై విరుచుకు పడ్డారు. ఆపై బండ బూతులు తిట్టారు. మిమ్మల్ని ఇక్కడ పెట్టిందెవరు? పరుష పదజాలంతో ఆలయం ఎదుటే ఉద్యోగిని దూషించారాయన. అసలు ఏమనుకుంటు న్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు వెళ్లు, థర్డ్ క్లాస్‌ వ్యక్తులను ఇక్కడ ఎవరుంచారని రుసరుసలాడారు.

 

ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీటీడీ వీజీఓ, పోటు ఏఈఓ అక్కడికి చేరుకున్నారు. బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపారు. ఈ వ్యవహారంపై నరేష్‌కుమార్‌ మాట్లాడారు. కొందరు ఉద్యోగులు తమ స్థాయికి తగ్గట్టుగా గౌరవం ఇవ్వట్లేదన్నారు. ఒక్కోసారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.

 

భక్తులు ఏమంటున్నారు?

 

ఇలా రకరకాలుగా అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు సదరు సభ్యుడు. ఈ తతంగాన్ని చూసిన భక్తులు షాకయ్యారు. హవ్వా.. బోర్డు సభ్యుడు ఇలా కూడా మాట్లాడుతారా అంటూ సైలెంట్ అయిపోయారు. ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును చాలామంది భక్తులు గమనించారు. సాటి ఉద్యోగులైతే సైలెంట్ అయిపోయారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బోర్డు సభ్యుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండాల్సింది పోయి బూతుపురాణం ఏంటంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

టీటీడీ పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు అక్కడికి వచ్చే భక్తులకు భక్తులకు ఆదర్శంగా ఉండాలి. అలాంటిది బోర్డు సభ్యుడు సంయమనం కోల్పోయి దూషణలకు దిగడంపై చాలామంది పెదవి విరిస్తున్నారు. ఆ పదవికి ఉన్న గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపారని చర్చించుకుంటున్నారు.

 

ఇలాంటి సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ, ఇష్టారాజ్యంగా ఉద్యోగులపై జులుం ప్రదర్శించడం ఏంటన్నది భక్తుల మాట. ఇది పబ్లిక్ ముందు జరిగిన వ్యవహారం కాబట్టి బయటకు తెలిసింది. తెలియకుండా ఇంకెన్ని ఉంటాయోనని అంటున్నారు. ఈ వ్యవహారం పాలక మండలి వరకు వెళ్లినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *