సాధారణ మహిళలు, యువతులే కాదు.. ఏకంగా కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కూడా ఆకతాయిల వేధింపుల నుంచి తప్పించుకోవడం లేదు. తాజాగా, కేంద్రమంత్రి కూతురును వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు.
జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు యువకులు వేధించారని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిపై ముక్తైనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఒకరిని షోహమ్ మాలి అనే వ్యక్తిని అరెస్ట్చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారని కేంద్రంమత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన యాత్రకు స్నేహితులతో కలిసి వెళ్తానని తన కుమార్తె కోరిందని.. దీంతో సెక్యూరిటీ గార్డుల సాయంతో అక్కడకు పంపించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని తెలిపారు.
అంతేగాక, అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారని కేంద్రమంత్రి తెలిపారు. గుజరాత్ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే తన కూతురు ఈ విషయం చెప్పిందన్నారు. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటో ఆర్థం చేసుకోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కేంద్రమంత్రి రక్షా ఖడ్సే తెలిపారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందుతులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని, అందులో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, మహాయుతి ప్రభుత్వ హయాంలో సామాన్యులకే కాదు.. కేంద్రమంత్రి కుటుంబసభ్యులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.