ఎమ్మెల్యే రాజాసింగ్ ను అలర్ట్ చేసిన పోలీసులు..! ఎందుకంటే..?

Spread the love

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లోకి వచ్చేశారు. హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అలర్ట్ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. ఎక్కడికైనా వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, సెక్యూరిటీని వినియోగించుకోవాలని సూచన చేశారు. ఉన్నట్లుండి ఎందుకు అలాంటి సూచన వెనుక అసలేం జరుగుతోంది?

 

ఏం జరిగింది?

 

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తుకు వచ్చేవారిలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. ఎవరు ఏమనుకున్నా చెప్పాల్సిన నాలుగు మాటలు సూటిగా చెప్పేస్తారు. అదే ఆయనకు ఒక్కోసారి బ్యాడ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తోంది. అయితే బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్ హాట్ పోలీసులు సూచించారు.

 

రక్షణ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఆయన తరచూ తిరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. భద్రత గురించి తరచుగా బెదిరింపులు వస్తున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ప్రభుత్వం కేటాయించిన 1+4 సెక్యూరిటీని ఉపయోగించాలని సూచించారు పోలీసులు.

 

పోలీసుల రాసిన లేఖలో సారాంశం

 

మీరు తరచుగా ఇంటి నుంచి ఆఫీసుకు భద్రతా సిబ్బంది లేకుండా వెళ్తున్నారని ఆ లేఖలో రాసుకొచ్చారు పోలీసులు. బయటకు వెళ్లి ప్రజల మధ్య తిరుగుతున్నారని, ఈ విషయంలో భద్రత నిర్లక్ష్యం కనిపిస్తోదన్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

 

ఎమ్మెల్యే వెర్షన్ ఏంటి?

 

శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులతో సహకరించాలని పోలీసులు ప్రస్తావించారు. పోలీసుల లేఖపై ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం రియాక్ట్ అయ్యారు. తన నియోజకవర్గం గోషామహల్‌లో కాలనీలు, మురికివాడలు ఇరుకుగా ఉంటాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగైతే ప్రజలకు తాను అందుబాటులో ఉండలేనని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో తాను బైక్‌ను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.

 

భద్రతా సమస్యలను పేర్కొంటూ గతంలో తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నానని సదరు ఎమ్మెల్యే గుర్తు చేశారు. తనపై పెండింగ్ కేసుల కారణంగా తాను పెట్టుకున్న దరఖాస్తును పోలీసు శాఖ తిరస్కరించిందని ఎత్తి చూపారు. అలాగే ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని చెప్పుకొచ్చారు.

 

కేంద్రం ఇంటెలిజెన్స్ సూచనతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం

 

రెండేళ్ల కిందట కూడా ఇలాంటి హెచ్చరికలు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వచ్చాయి. కేంద్రం ఇంటెలిజెన్స్ సూచనతో తెలంగాణ అధికారులు ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం కేటాయించారు. ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించారు. మరమ్మతులు చేసి మళ్లీ వాహనాన్ని ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పటికే పోలీసులు అధికారులు సూచనతో ఎమ్మెల్యే రాజా‌సింగ్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సివుంది.

 

ఈ మధ్యకాలంలో సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పాతవారు ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని ఓపెన్‌గా బయటపెట్టారాయన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *