వంట గ్యాస్‌పై రూ.50, పెట్రోల్‌పై రూ.2 సుంకం పెంచిన కేంద్రం..

Spread the love

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం పెంచింది. 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.50 చొప్పున పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

 

గత వారంలో, హోటళ్లు, రెస్టారంట్లు, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను రూ.41 చొప్పున కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రాల ప్రకారం ఈ తగ్గింపులో మార్పులు ఉంటాయి.

 

పెట్రోల్ పై రూ.2 సుంకం పెంపు

మరోవైపు సోమవారం మధ్యాహ్నం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని (సుంకం) రూ.2 చొప్పున పెంచబోతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో వినియోగదారులపై ప్రభావం పడబోదని ఆయన స్పష్టం చేశారు. పెరిగిన ఎక్సైజ్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని పేర్కొన్నారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్‌లో తెలిపింది.

 

ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం.. పెరిగిన ఎక్సైజ్ సుంకం రిటైల్ ధరలను ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించలేదు. అయితే, ఇది భారత వినియోగదారులపై ప్రభావం చూపదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలలో జరిగిన తగ్గింపుతో ఈ ఎక్సైజ్ సుంకం పెరుగుదల సమతుల్యంగా ఉంటుందని సమాచారం.

 

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ముందు మార్చి 14న ఇంధన ధరలలో చివరిసారిగా తగ్గింపు జరిగింది. ఎక్సైజ్ సుంకాన్ని రెండు సార్లు తగ్గించినప్పటి నుంచి పెట్రోల్ & డీజిల్ ఎక్సైజ్ సుంకాలు లీటరుకు వరుసగా రూ.13, రూ.16 చొప్పున తగ్గించబడ్డాయి.

 

ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోల్, డీజిల్ ధరలలో మరింత తగ్గింపు గురించి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ ముడి చమురు ధరలు ప్రస్తుత కనిష్ట స్థాయిలో ఉండటంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

మండిపడిన కాంగ్రెస్

 

వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘మోదీ జీ.. వంట గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా? ఈసారి ద్రవ్యోల్బణం కొరడా దెబ్బ ‘ఉజ్వల’ పేద మహిళల పొదుపు పైనా పడింది. దోపిడీ, మోసం అనే పదాలకు మోదీ ప్రభుత్వం పర్యాయ పదంగా మారింది’’ అని ఖర్గే మండిపడ్డారు.

 

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కూడా లాభం పొందుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 మే నుంచి ముడి చమురు ధరలు 41 శాతం తగ్గాయి. అయినప్పటికీ, ప్రభుత్వం వినియోగదారులకు ఈ తగ్గింపును ఎలాంటి ప్రయోజనాలుగా అందించట్లేదని ఖర్గే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *