జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కేసీఆర్ ప్రకటన..

Spread the love

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ఈ నియోజకవర్గానికి జరగనున్న బైపోల్‌కు సంబంధించి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది బీఆర్ఎస్ . దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును కేసీఆర్ ప్రకటన చేశారు. ఆమె పేరు ప్రకటించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

 

వచ్చేవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న వార్తల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ముమ్మురంగా కసరత్తు చేశాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిన తర్వాత బీజేపీ అభ్యర్థి ఎవరన్నది తేలనుంది.

 

ఎమ్మెల్యే లేదా ఎంపీ ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ నుంచి చాలామంది రేసులో ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి టికెట్ వస్తే గెలవడం ఈజీ అవుతుందని నాయకులు భావిస్తుంటారు. జూబ్లీహిల్స్ బైపోల్ రేసులో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు పోటీపడుతున్నారు. పలుమార్లు నియోజకవర్గంలో ఆ పార్టీ సర్వే చేయించింది. పార్టీ హైకమాండ్‌కు నివేదిక వెళ్లిపోయింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రతీ డివిజన్‌కు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వాహించారు కేటీఆర్. వారి నుంచి సమాచారం తీసుకున్న ఆయన, ఆ తర్వాత పార్టీ హైకమాండ్‌కు వివరించారు. ఈ క్రమంలో దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు.

 

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్తవారికి టికెట్ ఇస్తే వర్కవుట్ కాదని బీఆర్ఎస్ అంచనా. అందులో మూడుసార్లు మాగుంట గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇస్తే ఫలితం దక్కుతుందని భావించి సునీత పేరును ఖరారు చేసింది.

 

నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది బీఆర్ఎస్. ఆ తర్వాత కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనిద్వారా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందనే బలమైన సంకేతాలను పంపించింది.

 

మరోవైపు బీజేపీ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు అలాంటి వ్యూహాన్ని అవలంభించాలని ఆలోచన చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రేసులో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు ఉన్నట్లు సమాచారం.

 

అధికార పార్టీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ ప్రకటిస్తుందా? ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తుందా? అనేది తెలియాల్సివుంది. ఒకవేళ బీజేపీ గనుక డ్రాపయితే ఆ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పడడం ఖాయమని, కారు పార్టీ గెలవడం ఈజీ అవుతుందని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చర్చించుకుంటున్నారు. మరి తెలంగాణ బీజేపీ నేతల మదిలో ఏముందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *