డొంక కదులుతోంది, రేపోమాపో ఆ నేతలకు నోటీసులు..!

Spread the love

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్న మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం తొలుత ఇద్దరు లేదా ముగ్గురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. ఇంతకీ ఆ నేతలు ఎవరు? అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు చేసిన లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నా యి. అధికారుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించిన డబ్బును వివిధ ప్రాంతాలకు తరలించడంలో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించారు. ఈ ప్రక్రియలో మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును వివిధ నియోజకవర్గాలకు పంపినట్టు తేలింది. డబ్బు రవాణాకు ఎస్కార్ట్‌గా టాస్క్‌ఫోర్స్ డిపార్టుమెంట్‌కి చెందిన ఓ ఎస్ఐని వినియోగంచుకున్నారట రాధాకిషన్‌రావు.

 

నిఘా బృందాలకు చిక్కకుండా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి అందులో డబ్బును పెద్ద ఎత్తున తరలించారు. డబ్బు తరలింపుపై ఎస్కార్ట్‌గా ఉన్న ఎస్ఐకి అనుమానం వచ్చినా.. పైస్థాయి అధికారి చెప్పడంతో నోరు విప్పలేకపోయాడట. అయితే ఎన్నికల సంఘం ఆయన్ని తొలగించడంతో అసలు గుట్టు ఎస్ఐకి అర్థమైంది. ఎన్నికల ఫలితాలు తర్వాత రాధాకిషన్‌రావు తన పదవికి రాజీనామా చేశారు.

 

ఫోన్‌లో జరిగిన సంభాషణల గుట్టు బయటకురాకుండా ఉండేందుకు సెల్‌ఫోన్లను ఫార్మాట్ చేసినట్టు తెలుస్తోంది. వాటిని ఎంక్వైరీ టీమ్ స్వాధీనం చేసుకుని డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ డేటా రిట్రీవ్ అయితే మరికొందరి నేతలు పేర్లు బయటకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

రీసెంట్‌గా ఈ కేసు వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విచారణ జరుగు తోందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే వ్యవహారాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి ఈడీకి ఫిర్యాదు చేశారు కూడా. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *