తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఎదురు చూపులకు ప్రభుత్వం తెరదించింది. ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది. మొదటి, రెండో ఏడాది ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరీ హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం విధితమే. ఫస్టియర్, సెకండియర్ లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా, నాలుగు విడతల్లో ఏప్రిల్ 10వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను విద్యార్థులు tsbie.cgg.gov.in, results.cgg.gov.in వైబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. చదువుతున్న సంవత్సరం, కేటగిరి, ఇయర్ టైప్, ఎగ్జామినేషన్ టైప్, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పై వైబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది.