ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. తాజాగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో రెండు సార్లు ఎంపీ అయిన నాని పొలిటికల్ ఇన్నింగ్స్కు తెరపడింది.
విజయవాడ ప్రజలకు రెండు పర్యాయాలు సేవ చేయడం గౌరవమని నాని ట్వీట్లో పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తానని.. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ ప్రజలకు దగ్గరగా ఉంటానని నాని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. విజయవాడ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన.
కేశినేని నాని రాజకీయ ప్రస్థానం
కేశినేని శ్రీనివాస్(నాని) 2008లో అప్పటి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తరువాత 2009లో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాని టీడీపీ తరఫున విజయవాడ పార్లమెంట్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్పై 74 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
ఇక 2019 ఎన్నికల్లో నాని మరోసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి సమీప వైసీపీ అభ్యర్థి ప్రసాద్ వి పోట్లూరిపై 8 వేల ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఇక 2024 ఎన్నికల ముందు నాని టీడీపీలో జరిగిన పరిణామాలతో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరిన నాని.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ సారి అతని సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. దాదాపు 2 లక్షల 82 వేల పైచిలుకు ఓట్లతేడాతో చిన్ని చేతిలో ఓటమి చవిచూశారు.