జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో.. పవన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షించారు. తొలుత ఆయన క్యాంప్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
ఈ మేరకు నిన్న క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్.. అధికారులకు పలు సూచనలు చేశారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో.. జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. అభిమానులు సైతం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకి.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాలకి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశం కానున్నారు. ఇక రాత్రికి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ బస చేయనున్నారు.