నీట్ వివాదంపై కాంగ్రెస్ ఆగ్రహం.. జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు..!

Spread the love

నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రతిధ్వనిస్తానంటూ రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసన తెలపాలంటూ కాంగ్రెస్ తాజాగా పిలుపునిచ్చింది. పార్టీ యూనిట్లలో నిరసనలు చేపట్టాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం కోరారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి బీహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో వ్యవస్థీకృత అవినీతి స్పష్టంగా కనిపిస్తుందంటూ వేణుగోపాల్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో జరిగే ఇటువంటి అక్రమాలు పరీక్ష ప్రక్రియల విశ్వసనీయతను దెబ్బతీస్తాయంటూ పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేసి యువత భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తామంటూ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగానే విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా తాము దేశవ్యాప్త ఆందోళనలకు పిలిపునిస్తున్నామంటూ వేణు గోపాలు తెలిపారు.

 

అయితే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైద్య సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కల్పించేందుకు నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 5న ఈ పరీక్షను నిర్వహించారు. సుమారుగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. కాగా, 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్ సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఈ మార్కులను కలిపారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *