అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం..

Spread the love

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నేడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.

 

గురువారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల చేత నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు.

 

ఇతర పార్టీల నుంచి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

టీడీపీలో సీనియర్ నేతగా కొసాగుతున్న అయ్యన్న పాత్రుడు.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారిగా నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజారిటీతో నర్సీపట్నం ప్రజలు ఆయనను గెలిపించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆయన ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ గెలిచారు.

 

గత ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యేవారు. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చేవారు. అంతేకాదు.. మంచి వాక్చాతుర్యమున్న వ్యక్తిగా ప్రజల్లో ఆయనకు పేరుంది. ఈ అన్ని అంశాల దృష్ట్యా సీఎం చంద్రబాబు.. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *