తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2024 పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డీఎస్సీ పరీక్షలను జరగనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహిస్తారు.
అదేవిధంగా జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) పరీక్షలు జరుగుతాయి. జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్, జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష, జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనున్నారు.
అయితే, రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం విధితమే. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల పరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.